విజయనగరం జిల్లాలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. దీనిలో భాగంగా స్థానిక గుంకలాం లేఅవుట్ ను కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో, విజయనగరం ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జేసీ కిశోర్కుమార్, డాక్టర్ ఆర్.మహేష్కుమార్, వైకాపా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పరీశీలించారు.
ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యే హెలీపాడ్ స్థలాన్ని, పైలాన్ నిర్మించే చోటును, బహిరంగ సభా వేదికను, ఆర్చ్లను ఏర్పాటు చేసే స్థలాలపై చర్చించారు. మ్యాప్లను పరిశీలించారు. ఆయా స్థలాలను పరిశీలించి ఖరారు చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీని, గృహనిర్మాణాల ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు.
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా గుంకలాం లేఅవుట్లో సుమారు 15,500 మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇది నిరంతర కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు ప్రతిపక్ష టిడిపి ఎన్నో కుయుక్తులు పన్నినప్పటికీ, ముఖ్యమంత్రి ధృడ సంకల్పంతో ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఈ నెల 25న ప్రారంభం అవుతుందని చెప్పారు. దీనిలో భాగంగా సీఎం చేతుల మీదుగా జిల్లాలో 30వ తేదీన జరిగే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయవంతం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఎమ్మెల్యే కోలగట్ల స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి ఎస్వి రమణమూర్తి, డుమా పిడి ఏ.నాగేశ్వర్రావు, తాశీల్దార్ ప్రభాకరరావు, ఎంపిడిఓ చైనులు, సీఐ టిఎస్ మంగవేణి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కెవి సూర్యనారాయణరాజు, అంబళ్ల శ్రీరాములనాయుడు, జి.ఈశ్వర్ కౌషిక్, ఆశపువేణు, బంగారునాయుడు తదతరులు పాల్గొన్నారు.