అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలకు సంబంభించి రైతులకు నష్టపరిహారం అందజేస్తామని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. ముదిగొండ మండలం మేడపల్లి, ముదిగొండ గ్రామాల్లో అకాల వర్షం, వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పొలాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంట దెబ్బతిన్న విధానం, ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత మేర నష్టపోయింది తదితర వివరాలను రైతుల వద్ద నుంచి తెలుసుకున్నారు. పొలాల్లో దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
రైతులు, కౌలు రైతులు అయిన పంట సాగులో ఉన్న ప్రతి రైతుకు నేరుగా నష్టపరిహారం అందజేస్తామని ఆయన తెలిపారు. పంట నష్టం వివరాల నమోదుకు పాస్ బుక్ అవసరం లేదని, సర్వే నెంబరు, సాగు రైతు బ్యాంకు పాస్ పుస్తకం కావాలని ఆయన తెలిపారు. తమ పంటలు చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వానకు పంట నేలమట్టం అయిందని పూర్తిస్థాయిలో నష్టపోయామని తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ కు ఆవేదనను వెళ్లబుచ్చారు.
సమగ్రంగా సర్వే చేపట్టి పంట నష్టం వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. వ్యవసాయ అధికారులు సర్వే చేపట్టి, ఏ ఒక్క రైతు నష్టపోకుండా నష్ట నివేదికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు.కలెక్టర్ పర్యటన లో జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, ముదిగొండ మండల తహసీల్దార్ శిరీష, ఎంపీడీఓ శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారిణి రాధ, వ్యవసాయ విస్తరణ అధికారిణి మౌనిక, అధికారులు తదితరులు పాల్గొన్నారు