దేశవ్యాప్తంగా రోజు రోజుకూ మసకబారుతున్న ప్రతిష్టతో ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పార్టీ సీనియర్ నాయకులు పార్టీ ప్రక్షాళన వైపు మొగ్గు చూపుతుండగా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని సోనియాగాంధీ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు జరగనున్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. పార్టీ సీనియర్ నాయకులు 26 మంది కలిసి రెండు వారాల కిందట సోనియాగాంధీకి ఒక లేఖ రాశారు.
పార్టీ నుంచి యువత దూరంగా జరిగిపోయిందని, సమాజంలోని చాలా వర్గాలలో విశ్వాసం కలిగించలేకపోతున్నామని ఈ దశలో పార్టీ ప్రక్షాళన తప్పని సరి అని వారు తమ లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన నాయకులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నేతలకు గట్టి సందేశం ఇచ్చారు.
అందరూ కలిసికట్టుగా కొత్త అధినేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ సారథ్య బాధ్యతలను తాను ఇకపై నిర్వహించాలనుకోవడం లేదని తెలియజేశారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సోనియా గాంధీ ఈ విధంగా స్పందించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ, సోనియా గాంధీ ఇకపై పార్టీ సారథ్య బాధ్యతలను నిర్వహించడం పట్ల ఆసక్తి ప్రదర్శించడం లేదన్నారు. ఆగస్టు 10న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆమెను మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించమని కోరిన సంగతి తెలిసిందే.
గత ఏడాది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరగా పార్టీ చీఫ్ను ఎన్నుకోవాలనే షరతును ఆమె అప్పుడే విధించారు. అయితే ఆ తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనలేదు.
ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే అంతకు మించి పార్టీ కార్యక్రమాలు, పునరుత్తేజానికి చర్యలు లేకుండా పోయాయి. ఈ దశలో సీనియర్ నాయకులు ఈ లేఖ రాశారు. దానికి సోనియాగాంధీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు.