కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రతినెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి ఇక్కడ నుండి ప్రజలు వెళ్ళే వారు.
దీంతో సమయం డబ్బు వృథా అవుతున్నాయని గమనించిన జిల్లా కలెక్టర్ అధికార యంత్రాగానికి బిచ్కుంద మండల కేంద్రానికి తీసుకొచ్చి ప్రజావాణి కొనసాగిస్తున్నారు. ఉదయం నుండి ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఇరవై ఏడు మంది ఫిర్యాదుదారుల ను౦డి సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదులో ప్రధానమైనవి డోంగ్లీ ప్రభుత్వాస్పత్రిలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వైద్యురాలు శ్వేత ఫిర్యాదు చేశారు. దీంతో తదుపరి చర్యల నిమిత్తం బిచ్కుంద ఆలయాధికారి కి పంపారు. నర్సరీ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు డబ్బులు రాలేవని మద్నూర్ మండలం చెందినవారు ఫిర్యాదు చేశారు.
బిచ్కుంద మండల కేంద్రంలో కమ్మరి చెరువుకు వెళ్లే కాలువ అస్తవ్యస్తంగా నిర్మించారని మండల కేంద్రానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఉర్దు మీడియం మైనార్టీ పాఠశాలల్లో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికల్లో తమను పట్టించుకోలేదంటూ కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
అనంతరం పెన్షన్లు సదరం ధ్రువీకరణ పత్రాలు, రేషన్ బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించాలంటూ పలువురు అధికారుల దృష్టికి ఫిర్యాదు చేశారు. అనంతరం జెసి మాట్లాడుతూ కొందరు అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శాఖ అధికారులకు సమాచారం ఇస్తే గానీ ఎందుకు రావడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరు మార్చుకోవాలని లేని ఎడల తీవ్ర పరిణామాలుంటాయి అని స్పష్టం చేశారు.