ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గందరగోళంలో ఉన్నారని, ఇందుకు కారణం ఎన్నికలు దగ్గర పడటమే అని, ముందస్తుకు వెళ్ళాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక పోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 77వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని సీఎం చేసిన ప్రసంగ పాఠం పరిశీలిస్తే, ఆయన కంగారు,గాబరా, గందరగోళం ఆయన మాటల్లోనే తెలుస్తోందని అన్నారు.
దేశం గూర్చి, దేశ స్వాతంత్రం గూర్చి, సమరయోధుల గూర్చి ఒక్క మాటైనా మాట్లాడేందుకు ఆయనకు మనసు రాలేదన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామీణ స్వరాజ్యం కన్నా ,వాలంటీర్ల వ్యవస్థ మేలు అనే కుతర్కం చేశారన్నారు. స్వాతంత్ర వేడుకలను కూడా రాజకీయ ఉపన్యాసంగా మార్చారని, న్యాయ స్థానాల్లో రాజధాని అంశం ఉండగా, కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ మూడు ముక్కలాటను ప్రస్తావించారని, ఏటేటా పూర్తి చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన పోలవరంను ఏకంగా 2025కు వాయిదా వేశారన్నారు.
కులం మీద, అంటరానితనం మీద ముఖ్యమంత్రికి ఎలాంటి అవగాహన లేదన్నారు. రూపం మార్చుకున్న అంటరాని తనం అంటూ తన నాలుగేళ్ల పాలనలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలపై పరదాలు కప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బస్సు చార్జీలు పెంచి, పాఠశాలలను రద్దుచేసి, 27 రకాల సంక్షేమ పథకాలను ఎత్తి వేసి, కార్పొరేషన్ నిధులు ఎగ్గొట్టి, సబ్ ప్లాన్ నిధులు ఎండ బెట్టి, దళితులపై దాష్టీకాలు చేస్తున్న వైకాపా పాలనలో దళితుల నామస్మరణ చేసే అర్హత ముఖ్యమంత్రికి లేదన్నారు.
తాను ఏది చెబితే, దాన్నే ప్రజలు నమ్ముతారు అనే భ్రమలో సిఎం ఉన్నారని, గత ప్రభుత్వాలు కూడా ఇదే ధోరణి లో ఉండి, ఆఖరికి అధికారం పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. అలవికాని అబద్దాలతో అలబోకగా మాట్లాడితే ప్రజలు గొర్రెల్లా తలలు ఊపుతారనే భ్రమలో ఉన్నారని, గొర్రెలలో కూడా కొమ్ములున్న పొట్టేలు ఉంటాయని, అవి మందకు దారి చూపిస్తాయని బాలకోటయ్య ముఖ్యమంత్రికి సూచించారు.