ముఖ్యమంత్రి జగన్ జాతకం మారబోతున్నదనే విషయం తెలిసి వైసీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న కష్టాలు తొలగిపోయి జగన్ కు ఊరట కలగబోతున్నదనే విషయాన్ని విశాఖపట్నం శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపినట్లు సమాచారం అందింది. జాతక రిత్యా ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పుడు అష్టమ శని నడుస్తున్నదిట. అందువల్ల ఆయనకు నీలాపనిందలు వచ్చినట్లు చెబుతున్నారు.
జనవరి 18 నుంచి శని మకరం నుంచి కుంభం లోకి మారబోతున్నదని అందువల్ల జగన్ జాతకం మెరుగుపడుతుందని రాజగురువు చెప్పారట. శని మారకం జరుగుతున్న నేపథ్యంలో అష్టమశని పీడితుడైన జగన్ కు రాజకీయంగానూ, వ్యక్తిగతంగానూ కూడా మంచి రోజులు రాబోతున్నాయని రాజగురువు స్పష్టంగా చెప్పారట. దాంతో జనవరి 18 తర్వాత మంచి రోజు చూసుకుని విశాఖ పట్నం నుంచి పాలన ప్రారంభించాలని కూడా సీఎం జగన్ అనుకుంటున్నారు. ఈ మేరకు స్వరూపానందేంద్ర సరస్వతి తన వారసుడితో ఇటీవల కబురు పంపించారు.
దాంతో సీఎం జగన్ కూడా తన జాతకం మారిపోతున్న విషయాన్ని తెలుసుకుని ఆనందంగా ఉన్నారట. అష్టమ శని రాశి మారుతున్నందున ఊరట కలుగుతుందని, ఈ ఊరట సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయాలని కూడా సూచించారని చెబుతున్నారు. జనవరి 18 తర్వాత జగన్ తన పరిపాలనా రాజధానిని మారుస్తారని అంటున్నారు. అయితే దీనికి పరిపాలనా రాజధాని అని చెప్పే వీలు లేనందున ముఖ్యమంత్రి కార్యాలయం అని మాత్రమే అంటారు.