ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ కు ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ వినతి పత్రం సమర్పించింది. చేవెళ్ల బహిరంగ సభలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన దళిత గిరిజన డిక్లరేషన్ మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.
అయితే అందులో మొదటి అంశమైన ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకోవడం లేదని భావన సర్వత్ర ఉంది. వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలమైన ప్రకటన చేసిన తర్వాత ఉభయ రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ చేసిన అనేక పోరాటాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేయడం కోసం ఉషా మెహ్రా కమిషన్ వేసింది. కానీ ఉషా మెహ్రా కమిషన్ సూచించిన అంశాలను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోజు చిత్తశుద్ధిగా నిలబడలేకపోయింది.
అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 2018 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటన చేయగా ఆ ఎన్నికల్లో సహకారం అందించామని వారు తెలిపారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పై పార్లమెంట్ లో ప్రస్తావిస్తారని నమ్మి కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికామని అన్నారు.
కానీ పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై ఏ విధమైన పోరాటం చేయలేదని అన్నారు. పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఈనెల 18 తేదీ నుండి 22 తేదీల వరకు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై కేంద్ర ప్రభుత్వంపై తమ వంతు ఒత్తిడి చేయాలని అదేవిధంగా రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటంలో ఎమ్మార్పీఎస్ కు అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఎమ్మార్పీఎస్ కన్వీనర్ పుల్లూరి కరుణాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ములుగు జిల్లా కో ఇన్చార్జి ఏకు శంకర్ మాదిగ, ఎంఈఎఫ్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నెమలి నరసయ్య మాదిగ, ఎం ఎస్ పి జాతీయ నాయకులు జన్ను రవి మాదిగ, ఎంఎస్పి జాతీయ నాయకులు చత్తీస్ గఢ్ రాష్ట్ర ఇంచార్జ్ ఇరుగుపైడి మాదిగ, ములుగు జిల్లా మాదిగ మహిళా సమైక్య జిల్లా ఇన్చార్జి వావిలాల స్వామి మాదిగ, మాదిగ యువసేన జిల్లా ఇన్చార్జి కడప శ్యామ్ మాదిగ, వృద్ధులు వితంతుల జిల్లా ఇంచార్జ్ గజ్జల ప్రసాద్ మాదిగ, మహాజన భవన కార్మికుల సంఘం జిల్లా ఇన్చార్జి ఎంపెల్లి మల్లేష్ మాదిగ, మాదిగ కళా మండలి జిల్లా ఇన్చార్జి కల్లేపల్లి రమేష్ మాదిగ, మహాజనస్ట్ పార్టీ ములుగు పట్టణ ఇన్చార్జి మరాటి రవీందర్ మాదిగ, వెంకటాపూర్ ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ అలకొండ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.