ప్రముఖ బహుళ జాతి పెట్టుబడి సంస్థ లెగ్ మాసన్ ఇన్ కార్పొరేషన్ భారత దేశంలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. తన పెట్టుబడులను మలేషియా, చైనా దేశాలకు మళ్లించేందుకు నిర్ణయం తీసుకుంది.
భారత ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పై నుంచి దృష్టి మరల్చి ఇప్పుడు కేవలం పౌరసత్వ సవరణ చట్టం సంబంధిత అంశాలపైనే శ్రద్ధ చూపుతున్నందున తాము ఎలాంటి రిస్క్ తీసుకోలేమని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాటి నుంచే అంతర్జాతీయంగా పలు వత్తిడులు ఎదుర్కొంటున్న భారత్ లెగ్ మాసన్ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మరింత ప్రభావం చూపుతుంది.
భారత్ లో 453 బిలియన్ డాలర్ల పెట్టుబడులను కలిగి ఉన్న ఈ సంస్థ, భారతీయ బాండ్లలోని తన హోల్డింగ్స్ ను ఉపసంహరించి చైనా, మలేషియా మార్కెట్లకు మళ్లించింది. ఈ విధంగా లెగ్ మాసన్ మరెన్ని పెట్టుబడులను ఉపసంహరించుకుంటుందో తెలియదు. పౌరసత్వ సవరణ చట్టం వచ్చిన తరువాత దేశంలో జరుగుతున్న ఆందోళన కారణంగా పరిస్థితులు ఏ విధంగా మారతాయో తెలియని అనిశ్చిత పరిస్థితి ఉన్నట్లు ఆ కంపెనీ భావిస్తున్నది.
ఆసియా ఎక్స్-జపాన్ ఇన్వెస్ట్మెంట్స్ అధినేత డెస్మండ్ సూన్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ఆర్థిక విధానాన్ని రూపొందించడంలోనూ, సంస్కరణ అమలులో వెనుకబడిందని అన్నారు. అందుకోసమే భారతదేశంలో పెట్టుబడులను తగ్గించాలని మేం పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.