పెరిగిన పెట్రోలు, వంట గ్యాస్ ధరలకు నిరసనగా కడప జిల్లా మైదుకూరులో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు.
ఈ మేరకు ప్రజల నుంచి సంతకాల సేకరణ కూడా జరిపారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం పీల్చి తాగుతున్నాయని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు అసాధారణ రీతిలో పెంచడం అమానుషం, అమానవీయం అని ఆయన అన్నారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై పెంచిన ఎక్సైజ్ సుంకం ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై అదనపు వ్యాట్, రోడ్డు సెస్సు ను ఉపసంహరించాలని ఆయన కోరారు. అదే విధంగా పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, కడప పార్లమెంట్ ఇంచార్జ్ గుండ్లకుంట శ్రీరాములు, సుబ్బరాయుడు గొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి , శ్యామల దేవి విష్ణు ప్రీతం రెడ్డి, కుమార్ రెడ్డి పాల్గొన్నారు.