విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే, ఉపేక్షించబోమని, వారిపై కేసులు తప్పవని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మద్యం సేవించే వారిని హెచ్చరించారు. నేరాలను నియంత్రించాలనే లక్ష్యంగా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశించారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. గ్రామ, నగర శివార్లలోను, లే అవుట్లు, తోటల్లోను, డాబాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
ఇందులో భాగంగా గత 15 రోజులుగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 1063 కేసులు నమోదు చేయడంతో పాటు, మరో 185 మంది ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసారు. మద్యం సేవించి, వాహనాలు నడిపి, ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కూడా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి, బ్రీత్ ఎనలైజర్లును ఉపయోగించి, రాత్రుళ్ళు తనిఖీలు చేపడుతున్నారు.
గత 15 రోజుల్లో ఇప్పటి వరకు మద్యం సేవించి, వాహనాలు నడిపిన 76 మందిపై కేసులు నమోదు చేసి, వారిపై జరిమానాలు విధించామని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.