రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, మంగళవారం హుమాయూన్ నగర్ ప్రాంతంలోని కంటేన్ మెంట్ జోన్ లో పర్యటించారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా జి.హెచ్.యం.సి పరిధిలో గుర్తించిన 135 కంటేన్ మెంట్ జోన్ లలో అధికార యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ రోజు సందర్శించారు.
ఈ పాంత్రంలో “మర్కజ్” వెళ్ళి వచ్చిన ఒక్క వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలు కలిగివుండంతో ఆ కుటుంబం లోని మిగిత సభ్యులకు కూడా ఆ వైరస్ సోకినది. ఈ ప్రాంతంలోని ఇతర వ్యక్తులకు సోకకుండా నివారణ చర్యలు చేపట్టడానికి కంటేన్ మెంట్ జోన్ గా ఈ ప్రాంతాన్ని గుర్తించామని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ జోన్ లో ఉన్న వ్యక్తులు బయటి ప్రాంతానికి వెళ్ళకుండా, నిరోధించడానికి ఈ చర్యలు చేపట్టామని అన్నారు. బ్యారీ కేడ్ లతో ఆ ప్రాంతం లోని వీధులను కట్టడి చేయడం, కంటేన్ మెంట్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాలలో శానిటైజేషన్, వైద్య బృందాలచే ఆ ప్రాంత వ్యక్తులకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం సలహా సూచనలు మేరకు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలలో చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబాలకు అవసరమైన నిత్యవసర సరకులు, మందులు అందచేయడానికి జి.హెచ్.యం.సి తరపున అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలకు వైద్య బృందం కూడా ఏర్పాటు చేశారు.