కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. దినసరి కూలీల జీవితాలైతే స్తంభించి పోయాయి. ప్రభుత్వం సాయం చేస్తున్నా, ప్రయివేటు వ్యక్తులు విరాళాలు ఇస్తున్నా ఇబ్బందులు తొలగడం లేదు.
ఎందరో దాతలు కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తున్నా సొంత డబ్బులు ఖర్చు చేసి శారీరక శ్రమ పడేవారు అరుదుగా ఉంటారు. హైదరాబాద్ నగరంలో అతి ఖరీదైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో లెక్కలేనన్ని పేదల ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఎంత చేసినా తక్కువే.
అయినా సరే విశ్రాంతి లేకుండా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. వచ్చిన విరాళాలను ప్రభుత్వానికి పంపేసి చేతులు దులుపుకోకుండా ఆయన పేదలకు ప్రస్తుతం అవసరమైనది ఆకలి తీర్చడం అనే ప్రధాన ధ్యేయంతో సొంతంగా కష్టపడుతున్నారు.
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 12 ప్రాంతాలలో నిత్యం పేదలకు ఆహార పదార్ధాలు అందచేస్తూనే ఉన్నారు. స్వయంగా వంటలు చేసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వడ్డిస్తున్నారు. ఆహార ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చే రేషన్ ప్రజలకు గింజ పొల్లు పోకుండా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడే కదా మనం ఆదుకోవాల్సింది అంటున్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పడే కష్టం చూసిన తర్వాత తాను చేసేది తక్కువే అని ఆయన అన్నారు.
లాక్ డౌన్ ఉన్నన్ని రోజులూ తాను పేదలకు ఆహార పదార్ధాలు అందిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యం న్యూస్ కు చెప్పారు. రోజుకు 1500 మంది వరకూ నాణ్యమైన ఆహారాన్ని ఆయన అందిస్తున్నారు.