వారెవరూ బయటకు రారు. కొత్తవారు ఎవరూ లోనికి వెళ్లరు అయినా అక్కడ ఉన్నవారందరికి కరోనా వచ్చింది. హైదరాబాదులోని పోలీస్ అకాడమీ పరిస్థితి ఇది. అకాడమీలోని 180 మందికి నేడు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 100 మంది ట్రైనీ ఎస్సైలు కాగా, మరో 80 మంది అకాడమీ సిబ్బంది. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు.
దాంతో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి అకాడమీలోనే క్వారంటైన్ ఏర్పాటు చేసినట్టు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ అకాడమీలో 1100 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 600 మందికి పైగా కానిస్టేబుళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక శిక్షణ ఇచ్చే సిబ్బంది, పాలనాపరమైన సిబ్బందితో కలిపి మొత్తం 2,200 మంది వరకు ఉంటారు. ఈ నేపథ్యంలో, మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అకాడమీలో భారీ ఎత్తున కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.