సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ భారత ప్రధాని PV నర్సింహారావు శత జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుడు సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్ రెడ్డి, జక్కుల మల్లయ్య,మేళ్ళచెరువు ముక్కంటి తదితర నాయకులు కార్యకర్తలు PV నర్సింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతూ 1938వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని దిక్కరించి వందేమాతర గీతాన్ని పాడిన ధైర్యశాలి ఆయన అన్నారు.
బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానందతీర్థ లతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర యోధుడు పి.వి.అని, తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ముద్దుబిడ్డ PV నర్సింహారావు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి మారుమూల గ్రామం వంగర నుండి హస్తిన వరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశం కిర్తి గర్వించేలా చేసిన మహనీయుడు ఆయన అన్నారు.
మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు అత్యంత చాకచక్యంతో పాలించిన అపర చాణిక్యుడు, రాజనీతిజ్ఞుడు పి.వి నరసింహారావు అని, బహుభాషా కోవిదుడైన పి.వి.నాటి భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను అంచనా వేసి సమూల మార్పులు చేసి భారదేశ ప్రగతికి ఆద్యుడైన వ్యక్తి పి.వి. ఒక్కరేనని అన్నారు.
ఆర్ధిక సంస్కరణలకు ఊతమిచ్చిన నేత
కుంటు పడుతున్న ఆర్థిక విధానానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసిన ఆద్యుడు పి.వి అని, 1957లో శాసనసభ్యుడిగా ఎన్నికైన పి.వి.అంచలంచలుగా ఎదిగి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి చేపట్టి నొప్పించక తానొవ్వక అందరినీ మెప్పించిన ఘనుడని అన్నారు.
సాహిత్యంపై ఉన్న మక్కువతో విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన వేయిపడగలు నవలను హిందీలోకి తర్జుమా చేసి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొంది గొప్ప సాహితీవేత్తగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచారని, తెలుగు హిందీ ఆంగ్లముతో పాటు 17 భాషలలో మంచి ప్రావీణ్యం సంపాదించి బహుభాషా కోవిదుడు గా నిలిచిన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరికీ ఆదర్శమూర్తిగా నిలవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల మల్లయ్య, కౌన్సిలర్లు కస్తాల శ్రవణ్ కుమార్, రామగోపి, కోల మట్టయ్య, తేజావత్ రాజా, సరితా వీరారెడ్డి, విజయ, వేముల నాగరాజు వరలక్ష్మి, వెంకటేశ్వర్లు, ధనమ్మ, సుంకరి శివరామ్ యాదవ్, కోలపూడి యోహాన్, బెల్లంకొండ గురవయ్య, సైదా, పోతనబోయిన రాంమూర్తి పాల్గొన్నారు.
ఇంకా, లచ్చి మళ్ళ నాగేశ్వరరావు, దొంతగాని జగన్, వల్లపుదాసు కృష్ణ, పల్లపు పెద్దబ్బాయి, యడవెల్లి వీరబాబు, దాసరి రాములు, చిలకబత్తిని జయరాజు, ఆకారపు సుదర్శన్, షేక్ ఉద్దండు, ఆవుల నాగేశ్వరరావు, పావని, రాజ్యం, సత్యనారాయణ, ఉష, కార్యకర్తలు పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.