ప్రజల నుండి ఎటువంటి రుసుము తీసుకోకుండా ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో ప్రజలు రెక్కాడితే కానీ డొక్కా డని పరిస్థితుల్లో ఉన్నారని ఇటువంటి క్రమంలో కరోనా పరీక్షల నిమిత్తం ప్రజలు డబ్బు చెల్లించలేరని ఆయన అన్నారు. కరోనా టెస్టులు ఉచితంగా చేయడం, ఆరోగ్యశ్రీ లోనే ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్టులు, వైద్యం ఉచితంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా బాధితుడికి ఏ ఒక్క రూపాయి ఖర్చులేకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యేవరకు పూర్తి ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో పారిశుద్ధ్యం మెరుగు పరచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు.
కరోనా వైరస్ లేని సమయంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి, ఇప్పుడు రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బ్లీచింగ్,శానిటైజ్ చేయడం లో ఎక్కువగా నిర్లక్ష్యం జరుగుతుందని తక్షణమే నరసరావుపేట నియోజకవర్గంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అన్నారు.