కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మే నెల నాటికి దేశంలో దాదాపుగా 38,000 మరణాలు సంభవించే అవకాశం ఉంది. అదే విధంగా 5 లక్షల మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న 652 నుండి మరణాల సంఖ్య 38220 కి పెరుగుతుందని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు, ముంబై ఐటి, పూణేలోని సాయుధ దళాల ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఈ సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుక్కోవాలంటే మే నెల మొదటి వారం నాటికి దేశంలో కనీసం 76,000 ఐసియు పడకలు అవసరమని అధ్యయనం తేల్చింది. అధ్యయనం ప్రకారం ఆరోగ్య పరిరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా లేక సౌకర్యాలు తగినంతగా లేకపోయి సమీప భవిష్యత్తులో కరోనా మరణాల సంఖ్య 30 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. కోవిడ్ 19 మెడ్ ఇన్వెంటరీ అనే గణాంక నమూనాపై ఆధారపడి ఈ అంచనాలు వేశారు.
ఇటలీ, అమెరికాలో కూడా ఇదే పద్ధతిలో మరణాల అంచనాలు వేయగా దాదాపుగా సరిపోయాయి. ఈ అధ్యయనం ప్రకారం ఏప్రిల్ 28 నాటికి దేశ మరణాల సంఖ్య వెయ్యి దాటుతుంది. మే మొదటి వారంలో ఇది 3,000 కి చేరుకుంటుంది. మే మూడవ వారం, 19 వ తేదీ నాటికి ఇది 38,000 దాటుతుందని అధ్యయనం హెచ్చరించింది.