పేదవారికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు అవుతున్న జగనన్న కాలనీల్లో కింది స్థాయి అధికారుల అవినీతితో నిరుపేదలు మరిన్ని ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొణిజేటి చేనేతపురి కాలనీ లో అక్రమార్కులు రాజ్యమేలుతుండటంతో పేదలకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
చేనేతపురిలో పూర్తి అయిన జగనన్న కాలనీ ఇళ్లలోకి కొందరు పేదలు వచ్చి ఉంటున్నారు. ఈరోజు కాకపోతే రేపు అధికారులు వస్తారని, తమకు అర్హత ఉన్నందున తమకే ఆ ఇళ్లను కేటాయిస్తారని అక్కడి పేద ప్రజలు ఎదురుచూస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ఈ నిరుపేద కుటుంబాల పట్ల సానుభూతితో ఉండటంతో వారికి భరోసా ఏర్పడింది. అయితే ఉన్నతాధికారులు ఈ కాలనీ వైపు రావడంగానీ, పేదలైన తమకు ఆ ఇళ్లు కేటాయించడం కానీ ఇప్పటి వరకూ చేయలేదు. తమకు ఇళ్లు కేటాయించాలని కోరుతున్న వారికి కింది స్థాయి అధికారుల అవినీతి పిడుగుపాటుగా మారింది.
చల్లారెడ్డి పాలెం గ్రామ సచివాలయం లో ఉన్న కింది స్థాయి ఉద్యోగులు స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులతో కుమ్మక్కు అయి జగనన్న కాలనీలోని గృహాలను వేలంపాట వేసి అమ్మకాలు చేస్తున్నారని అక్కడి పేద ప్రజలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణ ముఖ్య ఉద్దేశాన్ని వీరు దెబ్బతీస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
దీంతో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సామాన్యులకు చేరువ కావడం లో సమస్యలు తలెత్తుతున్నాయి. సదరు అధికారులు చేనేత కార్మికులకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా అందించకుండా చేనేత కార్మికుల ను ఇబ్బందులు పెడుతున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే చేనేత పూరి కాలనీ సమస్యలపై స్పందించి తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.