ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల కారణంగా నష్టపోయిన సోయా, పత్తి పంట రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు టి.ఆర్.ఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు.
గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డి.సి.సి.బి డైరెక్టర్, జైనాథ్ పీ.ఏ.సీ.ఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డితో పాటు ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ జైనాథ్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి లు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అటు 2011 – 12 సంవత్సరంలో ఇలానే అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 22 కోట్ల రూపాయలను అందించడం జరిగిందని గుర్తు చేశారు. అదే మాదిరిగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారులతో పంట నష్టంపై సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని వినతిపత్రంలో కోరారు.
మరోవైపు పత్తి కొనుగోళ్ల విషయంలో కౌలు రైతులు, పార్ట్ -బి లోని రైతుల పేర్లు సాఫ్ట్ వేర్ లో పొందుపరచనందున కొనుగోలుకు ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. ఒక్క జైనాథ్ మండలంలోనే సుమారు 700 మంది పార్ట్ -బి లో, 1800 మంది కౌలు రైతులు ఉన్నారని, అదే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 6వేల మంది పార్ట్ -బి, 15 వేల నుండి 20వేల వరకు కౌలు రైతులు ఉంటారని తెలిపారు.
ఈ విషయమై ఇదివరకే ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించిందని పంట నష్టపోయిన సర్వే తో పాటు, పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్న కౌలు రైతులు, పార్ట్ -బి రైతులకు న్యాయం జరిగేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకొంటానని కలెక్టర్ హామీ ఇచ్చారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.