దగ్గు మందును బ్లాక్ లో అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్నాడో ఫార్మసిస్టు. చిన్న పిల్లలకు మత్తు కావాల్సిన వారికి దగ్గు మందును విక్రయిస్తూ జయంత్ అగర్వాల్ అనే వ్యక్తి అక్రమాలకు తెరతీశాడు. చిన్న పిల్లల్ని ఇలా దగ్గు మందుకు అలవాటు చేస్తున్నారు.
తక్కువ స్థాయిలో మత్తు వస్తుండటంతో వారు కూడా దీనికి అలవాటు పడిపోతున్నారు. అల్లర చిల్లరగా తిరిగే వారికి కూడా దగ్గు మందు అమ్ముతూ వారికి కూడా మత్తు అలవాటు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని దారూసలామ్ లో ఉన్న అగర్వాల్ ఫార్మసీ నడుపుతున్న జయంత్ అగర్వాల్ దగ్గు మందు పిల్లలకు అమ్ముతుండగా టాస్క్ ఫోర్సు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
దగ్గు మందును కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే అమ్మాల్సి ఉండగా జయంత్ అగర్వాల్ ఇలా చట్ట విరుద్ధంగా అమ్ముతున్నాడు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో డిప్యూటీ పోలీసు కమిషనర్ పి.రాధాకృష్ణారావు నేతృత్వంలో టాస్క్ ఫోర్సు సిఐ మహ్మద్ అబ్దుల్ జావేద్, ఎస్ ఐలు మహ్మద్ షానవాజ్ షఫీ, కె. శ్రీనివాసులు దాడి చేసి అరెస్టు చేశారు. పెద్ద ఎత్తున దగ్గు మందు స్వాధీనం చేసుకున్నారు.