వినాయక చవితి పండుగకు తిరుపతి నగరంలో ప్రధాన కూడళ్లలో భారీ విగ్రహాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ మేరకు నేడు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి, తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ సామoచి శ్రీనివాస్, సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి, మాంగాటి గోపాల్ రెడ్డి, ఆర్సి మునికృష్ణ, గుండాల గోపీనాథ్ రెడ్డి, మస్తాన్ నాయుడు, చెన్నం నవీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తిరుపతిలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్యాత్మిక చింతనతో నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నది.
రెండు అడుగుల మట్టి వినాయక విగ్రహాల తోనే పూజలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. వినాయక చవితి పండుగ నాడు పూజా సామాగ్రి విక్రయించే ప్రాంతాలలో నగర పాలక సంస్థ పోలీస్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ప్రజలు గుంపులుగా చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు.
పరిమిత సంఖ్యలో సాంప్రాదయబద్దంగా పూజలు
భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే రోజు సాయంత్రం అక్కడే ఓ పాత్రలో పెట్టి వినాయక నిమజ్జనం చేసి ఆ పవిత్ర జలాన్ని మొక్కలకు వినియోగించుకునేలా నగర పాలక సంస్థ అధికారులు సైతం ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
తిరుపతి నగర ప్రజలందరికీ ఫోన్ మెసేజ్ ద్వారా వినాయక చవితి పండుగకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై నగర పాలక సంస్థ అధికారులు అవగాహన కల్పిస్తూ సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు.