ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద తగినంత గాలి, వెలుతురు, తాగు నీరు ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ .సూర్య కుమారి ఆదేశించారు. చీపురుపల్లి నియోజక వర్గం కు సంబంధించిన చీపురుపల్లి, గుర్ల, మెరకముడిదాం, గరివిడి మండలాల కౌంటింగ్ ను ఏర్పాటు చేసిన గరివిడి ఎస్.డి.ఎస్ కళాశాలలో ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న కౌంటింగ్ శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు.
సిబ్బంది అటెండన్స్ , వాక్సినేషన్ వేసుకుంది లేనిదీ అడిగారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ లను సందర్శించారు. మెరకముడిదాం జెడ్ పి టి సి ఏకగ్రీవం కాగా మిగిలిన మూడు జెడ్ పి టి సి లు, ఎం.పి.టి సి ల కౌంటింగ్ కోసం 10 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి రూమ్ ను తనిఖీ చేసిన కలెక్టర్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సోషల్ డిస్టన్స్ పాటించేలా సీటింగ్ ఏర్పాటు గావించాలన్నారు.
ఎన్నికల ఫలితాలను గేట్ ముందు ప్రకటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఫలితాల కోసం లోపలకి వచ్చేవారిని అనుమతించ వద్దన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ప్రతి పని లో జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల ప్రత్యేకాధికారులు, ఎం.పి.డి.ఓ లు, తహశీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.