(సత్యం న్యూస్ ప్రత్యేకం)
ప్రస్తుతం కోవిడ్-19 వల్ల నెలకొన్న దుర్భర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు ” పీఎం కేర్స్ ఫండ్ ” అనే పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ను మార్చి 28 న ప్రారంభించింది. ఈ ట్రస్టుకు ప్రధాని చైర్మన్ గా వ్యవహ రిస్తుండగా కేంద్ర ఆర్థిక, రక్షణ, హోం శాఖ మంత్రులు తదితరులు సభ్యులుగా ఉన్నారు.
కరోనా యుద్ధాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు దేశ ప్రజలు స్వచ్చందంగా విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఈ ట్రస్ట్ ను ఏర్పరిచినట్లు ప్రధాని తెలిపారు. ఏదైనా అనుకోని విపత్తులు సంభవిస్తే ఈ ట్రస్ట్ నిధులు ఉపకరించగలవని ఆయన ప్రకటించారు.
విపత్తు నివారణ సామర్ధ్యాన్ని బలోపేతం చేయాడానికి, ప్రజలను కాపాడే పరిశోధనలను ప్రోత్సహించేందుకు నిధులు ఉపయోగపడగలవని మోదీ తెలిపారు. ఈ ట్రస్ట్ కు పౌరులు, కంపెనీలు మొదలుకుని అన్నిరంగాల వారు విరాళాలు ఇవ్వాలని ఆయన అర్ధించారు.
ఆరోగ్య కరమైన భారత్ ను సృష్టించగల ఈ ఫండ్ కు ఆదాయపన్ను మినహాయింపు కలదని ప్రధాని వివరించారు. మోదీ పిలుపుకు స్పందించి సాధారణ ప్రజలు మొదలు పలు రంగాలకు చెందినవారు విరాళాలు ప్రకటిస్తున్నారు. బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ లు, సినిమా, స్పోర్ట్స్వివిధ రంగాల వారు ఉదారంగా నిధులు సమకూరుస్తున్నారు.
కొన్ని కోట్లరూపాయలు ట్రస్టుకు జమ అవుతున్నాయి. స్వయానా ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ 25 వేల రూపాయల విరాళాన్ని పీఎం కేర్స్ కు ఇవ్వడం విశేషం. ఇప్పటికే ప్రధాని జాతీయ విపత్తు నిర్వహణ నిధి 3800 కోట్ల రూపాయల తో ఉండగా కొత్తగా పీఎం కేర్స్ ఫండ్ అవసరం లేదని కాంగ్రెస్ విమర్శించింది. భారత రాష్ట్రపతి ,ఉపరాష్ట్రపతి, స్పీకర్ ఒకనెల జీతాన్ని విరాళం ప్రకటించారు.
పార్లమెంట్ సభ్యుల ఎంపిలాడ్స్ నిధులను పీ ఎం కేర్స్ ఫండ్ కి బదలాయించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే….. ప్రస్తుతం దేశంలో 542 మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా వారిలో 83 శాతం (475 మంది) కోటీశ్వరులు ఉన్నట్లు ఏ డీ ఆర్ సంస్థ ప్రకటించింది.
వివరాల్లోకి వెళితే….బీజేపీ ఎంపీలలో 88%, కాంగ్రెస్ వారిలో 92%, డిఎంకె ఎంపీలలో 96%, తృణమూల్ సభ్యులలో 91%,వైయస్సార్ కాంగ్రెస్ లో 86% కోటీశ్వరులు ఉన్నట్లు ఆ సంస్థ విశ్లేషించింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలలోనూ అత్యధిక సంఖ్యలో ధనికులు ఉన్నట్లు ఏ డి ఆర్ వెల్లడించింది. వీరితో పాటు ఇతర చట్ట సభల్లో కూడా ధనవంతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఐనా….. పీ ఎం కేర్స్ కు లేదా
ఆయా రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధికి గాని వీరిలో ఏ ఒక్కరూ ఇప్పటివరకు విరాళం ప్రకటించక పోవడం ఆశ్చర్యకరం. ఎన్నికలలో కోట్లరూపాయలు మంచి నీళ్ళు ప్రాయం గా ఖర్చు పెట్టే రాజకీయ నాయకులు ఈ కష్ట కాలంలో సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం శోచనీయం. చిన్నారులు సైతం వాళ్ళు సరదాగా దాచుకున్న కొద్దిపాటి డబ్బుని సహాయ నిధికి విరాళం గా ఇచ్చి దాతృత్వాన్ని ప్రకటించడం అభినందించాలి.
ఈ ఆపత్కర స్థితికి స్పందించి ఉదారంగా విరాళాలు ఇచ్చి ప్రభుత్వానికి అండగా ఉండాలని రాజకీయనేతలకు విజ్ఞప్తి.
కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి