హైదరాబాద్ నగరంలో ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తే వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగా ప్రచారమవుతున్న అసత్య కథనాలపై సీపీ గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో కానీ మరే విధంగా కానీ అసత్య ప్రచారాల కారణంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే అందుకు బాధ్యులైన వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. అలాంటి వారిపై పీడీ యాక్ట కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల మాటల తూటాలు పేలుతుండడంతో కొందరు వాటిని ఆసరాగా చేసుకొని సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా నగర ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.