మాండస్ తుఫాన్ దాటికి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వీడి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి జి చంద్ర పేర్కొన్నారు. తుఫాన్ పట్ల జిల్లా అధికార యంత్రాంగ నిర్లక్ష్యంకు నిరసనగా కడప జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మూలంగానే గత ఏడాది అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయి అపార ప్రాణ, ఆస్థి నష్టం జరిగిందన్నారు. ఇంతవరకు అన్నమయ్య డ్యాం తెగిపోవడానికి కారకులైన అధికారులపై చర్యలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. తిరిగి అదే తరహాలో తుఫాన్ మూలంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం దారుణమన్నారు.
శనివారం సిపిఐ ఎంపీ బినయ్ విశ్వం కడప నగరంలోని జిల్లా కోర్టు, ఆర్టిసి బస్టాండ్, అప్సర తదితర ప్రాంతాలను పరిశీలించగా ఆ ప్రాంతాలన్నీ మురికితో కూడిన జలమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందికర దుర్బర పరిస్థితులును చవిచూసారన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో స్వయంగా వాకబు చేసి విచారించినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం దారుణమన్నారు.
జిల్లా కలెక్టర్ బంగ్లా కే పరిమితం కావడం, కింది స్థాయి అధికార యంత్రంగo కూడా ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. రోజు వారి పని చేసుకుంటే గాని పూట గడవని వారు అధిక సంఖ్యలో ఉన్నారని వాళ్లందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇప్పటికే నష్టపోయిన పంటలను అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించి రైతన్నలను ఆదుకోవాలన్నారు.
ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం వుండాలని, తుఫాను బాధితులకు సత్వరమే సాహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ను కలిసి ప్రభుత్వ తప్పిదాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, విజయలక్ష్మి, వేణుగోపాల్ నగర సహాయ కార్యదర్శిలు బాదుల్లా మద్దిలేటి నాయకులు పగడ పూల మల్లికార్జున,ఆర్ బాబు,వడ్ల భాగ్యలక్ష్మి, వలరాజు, లింగన్న,సుబ్బరాయుడు, నాగేశ్వర్ రావు, యానాదయ్య, జయన్న, బాలచంద్ర నాయుడు, నారాయణ,పుస్పరాజు,చైతన్య, సంజీవ్, కంబగిరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.