జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నదా? ఆయన పాలన పట్ల ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారా? ఈ ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికి సమాధానమా అన్నట్లు జగన్ తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలు ఉన్నాయి. తాజాగా విజయవాడలో పీసీసీ కార్యవర్గం బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరైన ఆయన తన ప్రసంగంలో ఏపీలో జరుగుతున్న పాలనపై ఆవేదన వ్యక్తం చేశారు.
నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక ప్రశ్నకు సమాధానంగా తాను వై ఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత సన్నిహితులమని చెప్పారు. ఆయన ఈ విధంగా చెప్పడాన్ని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువు అయిన కేవీపీ రామచంద్రరావును ఇదే విషయంపై ఒక యూట్యూబ్ ఛానెల్ విలేకరి ప్రశ్నించగా అది నిజమేనని చెప్పారు.
చంద్రబాబు, రాజశేఖరరెడ్డి సన్నిహితంగా ఉండేవారని ఆయన ధృవీకరించి వైసీపీని ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు జగన్ వ్యవహార శైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేవీపీ మరొకమారు వార్తల్లో నిలిచారు. ”బంగారు భవిష్యత్ కలిగిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలన చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. విభజన హామీల అమలు కోసం జగన్ పోరాడడం లేదు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని జగన్ నిలదీయడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం దశదిశ మారేదు.
ఇప్పుడు దాని దుస్థితి చూస్తుంటే బాధేస్తోంది” అని కేవీపీ చెప్పారు. జగన్ పోలవరాన్ని పట్టించుకోవడం లేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నా.. ఆపేందుకు ప్రయత్నించడం లేదు.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ సన్నిహితుల్లో చాలా మంది జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీలో చేరిన వారు .. పదవులు పొందిన వారు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. కానీ వారు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. బయట ఉన్నవారు మాత్రం.. బహిరంగంగానే చెబుతున్నారు.
జగన్ తీరును ఎండగట్టడానికి వైఎస్తో తమకు ఉన్న అనుబంధాన్ని కాసేపు మర్చిపోవడానికి కూడా వారు వెనుకాడటం లేదు. జగన్ మంత్రి వర్గంలో పని చేస్తున్న సీనియర్ మంత్రులు అందరూ కూడా ఒక దశలో కేవీపీకి సన్నిహితంగా ఉన్నవారే. ఈ దశలో కేవీపీ రామచంద్రరావు జగన్ పై ఇంత స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది.