ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వివిధ రకాల అధిక పన్నులు ,ధరల భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం ధరల పెంపు, పన్నుల భారం కు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర వ్యాప్త ప్రచారాందోలనలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయం నుండి నిరసన ప్రచార కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను శరవేగంగా అమలు చేస్తున్నాయని మండిపడ్డారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనెల అధికధరలు, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి నీటి చెత్త పన్నులు పెంపుతో సామాన్య, మధ్య తరగతి వర్గాలు విలవిల్లాడుతున్నారన్నారు. ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు రాయితీలిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రధాని కాకముందు గ్యాస్ ధర 450 రూపాయలు, పెట్రోల్ 64 రూపాయలు ఉండేవని నేడు పెట్రోల్ లీటరుకు 121 రూపాయలకు చేరిందని, గ్యాస్ ధర అధికంగా వెయ్యి రూపాయలకు మించిపోయిందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెట్రో ఉత్పత్తుల తో పాటు వంటనూనెలు, బియ్యం, పప్పు తదితర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయన్నారు. జగన్ ప్రభుత్వం సిమెంటు,ఆస్తిపన్ను లు,విద్యుత్ ఛార్జీలు పెంచిందని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో బాదుడే బాదుడు అన్న జగన్ ఇప్పుడు అన్నింటి పైన ధరలు పెంచేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఇచ్చేది వీసమంత-దోచేది కొండంత ల ఉందని ఎద్దేవా చేశారు.రాజకీయాలకతీతంగా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపైన వివిధ రూపాల్లో సోషల్ మీడియా ద్వారా సైతం నిరసనలు వ్యక్తం చేయాలని ప్రజలకు కరపత్రాలు పంచుతూ పిలుపునిచ్చారు.
13న సచివాలయంల వద్ద నిరసనలు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కృష్ణమూర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి , నగర కార్యదర్శి యన్. వెంకట శివ, నగర కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సావంత్ సుధాకర్,కె సి బాదుల్ల, మద్దిలేటి, మల్లికార్జున,భాగ్యలక్ష్మి, శంకర్ నాయక్, నాగరాజు, భరత్, సుబ్బరాయుడు, హుస్సేన్, యేసు రత్నం, కృష్ణ, వరప్రసాద్ నరసింహులు,రాధ, అమరావతి శైలజ, శివాచారి తదితరులు పాల్గొన్నారు.