రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ నివారణ కోసం,సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్య సౌకర్యాలు పెంచి, కరోనా టెస్ట్ లు విస్తృతంగా చేయాలని సీ.పీ.యం. జిల్లా నాయకులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు.
గురువారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రైవేటు హాస్పిటల్ లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వైద్య సేవలు అందించాలని కోరారు.
వైద్య, ఆరోగ్య శాఖ లో ఖాళీగా ఉన్న 2500 డాక్టర్ పోస్ట్ లు, 7500 నర్సు ల పోస్ట్ లను వెంటనే భర్తీ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. కరోనా వైరస్ నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. పేద,నిరుపేద కాలనీ లలో 104,108 మెబైల్ సర్వీసుల ద్వారా ఉచితంగా టెస్ట్ లు, మందులు అందించాలని డిమాండ్ చేశారు.
అనంతరం డాక్టర్ కిరణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు పామనుగుల్ల అచ్చాలు, నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, జిట్ట సరోజ, అవిశెట్టి పద్మ తదితరులు పాల్గొన్నారు.