విశాఖ రేంజ్ పరిధిలో వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదవుతన్న నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ ఐజి రంగారావు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం రేంజ్ వరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్ పరిధిలో పని చేస్తున్న పోలీసు అధికారులతో ఐజి రంగారావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ ఐజి రంగారావు మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించు కోవాలన్నారు. ఒక్కొక్క పోలీసు స్టేషను పరిధిలో ఒక్కో తరహా నేరాలు నమోదవుతాయని, వాటి నియంత్రణకు ఆయా పోలీసు స్టేషను అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
నేరాలను బట్టి చేపట్టే చర్యల్లో మార్పులు చేపట్టాలని, వాటి నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపడితే నేరాలు తగ్గుముఖం పడతాయో అన్న విషయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణలను రూపొందించి, చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అదే విధంగా పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులు, మహిళల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. బాధితులు స్టేషనుకు వచ్చిన కారణాలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను అర్ధం చేసుకొని, చట్ట పరిధిలో చర్యలు చేపట్టి, న్యాయం చేయాలన్నారు. రాత్రి సమయాల్లో బాధితుల నుండి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే స్పందించాలని, నీతి, నిజాయితీలతో పని చేసి, బాధితులకు అండగా నిలవాలన్నారు.
ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకాన్ని కల్పించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వాటిపై ఆకస్మిక దాడులు నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు.
ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో రహదారి ప్రమాదాలను నియంత్రించాలని, మహిళల పై జరిగే నేరాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను విశాఖ రేంజ్ ఐజి ఎల్.కే.వి.రంగారావు ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా ఎస్పీ దీపిక, అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్ డి ఎన్. సూర్య చంద్రరావు, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, దిశా డీఎస్పీ టి.త్రినాధ్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.