బీసీ సర్పంచ్ ను తీవ్రంగా అవమానించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాచాల మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీలపై దాడులు రోజురోజుకు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామ సర్పంచ్ విశ్వనాథంను కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 29 న మండల అధికారులు ప్రజా ప్రతినిధులు మీడియా, ప్రజల సమక్షంలో అవమానించారని ఆయన అన్నారు.
చెప్పుకోలేని, రాయలేని పదాలతో బూతులు తిట్టి తీవ్రంగా అవమానించారని, ఒక ఎమ్మెల్యే అయి ఉండి గ్రామ సర్పంచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సర్పంచ్ పై జరిగిన దాడిని బిసి వర్గంపై జరిగిన దాడి గానే భావిస్తున్నామని, బీసీల ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిర్వేన్ గ్రామ సర్పంచ్ విశ్వనాథం మాట్లాడుతూ తాను ఒక బీసీని కాబట్టి ఎమ్మెల్యే అవమానించాడని,అదే ఒక రెడ్డి సామాజికవర్గం వారిని అనే దమ్ము ఎమ్మెల్యే కి ఉందా అని ప్రశ్నించారు. గ్రామ ప్రథమ పౌరునికే దిక్కులేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని, తనను దూషించిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.
వనపర్తి మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రపతి కూడా గ్రామ సర్పంచ్ కు గౌరవం ఇస్తారని,కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లకు కనీస గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీలపై దాడి చేసిన వారెవరైనా ఉపేక్షించబోమని, ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు రవి నాయుడు,అంజన్న యాదవ్, కావలి అశోక్ కుమార్,నవీన్, మహేష్, రవి, సిద్ధార్థ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి