తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ”ధరణి పోర్టల్” అక్టోబర్ 29, 2020న ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదని, భూ రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ఆదర్శం అని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణి ప్రారంభమై విజయవంతంగా ఒక సంవత్సర కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వేగవంతంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం జరుగుతున్నదని, భూ పరిపాలన రంగంలో విప్లవాత్మకమైన ధరణి కార్యక్రమం వనపర్తి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నదని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశంలోనే తొలిసారిగా భూ రికార్డుల నిర్వహణకై ధరణి పోర్టల్ను అక్టోబర్ 29, 2020న ప్రారంభించారని, నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం తన కార్య కలాపాలను పూర్తి చేసుకొని వనపర్తి జిల్లాలో సమర్థవంతంగా అమలవుతుందని ఆమె తెలిపారు.
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా ఉన్న, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్లైన్ పోర్టల్ అని, భూ సంబంధిత లావాదేవీలకు ధరణి త్వరితగతిన పరిష్కారాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ సూచించారు.
వనపర్తి జిల్లాలో 14 చోట్ల రిజిస్ట్రేషన్లు
ధరణి ప్రారంభంతో, రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవని, అప్పుడు జిల్లాలో (2) రిజిస్ట్రార్ కార్యాలయాలు అందుబాటులో ఉండేవని, జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, వాటి సంఖ్య (14)కు చేరిందని ఆమె వివరించారు. తహశీల్దార్ కార్యాలయాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని, ప్రజలకు అందుబాటులో రిజిస్ట్రేషన్ లు జరగడం వల్ల దూర భారం తగ్గి, సమయం కలిసి వస్తున్నదని ఆమె వివరించారు.
భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పి, వ్యవసాయ, భూ సంబంధిత రిజిస్ట్రేషన్లు ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి అవుతున్నాయని, గతంలో భూ యజమానులకు తెలియకుండా మధ్యవర్తులు, దళారులు, పైరవీ కారులు అధికారుతో రికార్డ్ లు, పేర్ల మార్పిడి సంఘటనలు జరిగేవని, ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా అలాంటి సంఘటనలకు అవకాశం ఉండదని జిల్లా కలెక్టర్ అన్నారు.
రికార్డులు తారుమారు చేసే అవకాశం లేకపోవటం టాంపర్ ప్రూఫ్, రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే రికార్డులలో పట్టా మార్పులు జరగడం, విచక్షణా రహిత సేవలను అందించడం, ప్రజలకు సులభంగా సేవలు అందించటం, పారదర్శకత, ఇతరుల, మధ్యవర్తుల ప్రమేయం తగ్గించటం, IT సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా వెనువెంటనే పనులు పూర్తవుతాయని, తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం, ఆధునిక సాంకేతికత వినియోగం. వివక్షకు తావులేకుండా ఉండడం, అతితక్కువగా అధికారుల జోక్యంతో సేవలు అందించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ తో సౌకర్యం
అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ అది తెలుసుకునే అవకాశం ఉన్నదని, రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం, రిజిస్ట్రేషన్ ఫీజుల వివరాల లెక్కింపు, ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. ధరణి ద్వారానే ఆన్లైన్ చెల్లింపులు, నిషేధిత భూములను ఆటో లాక్ చేయటం, బయోమెట్రిక్ ప్రమాణీకరణ, మ్యుటేషన్ తో కూడిన నమోదు, ePPB కాపీ తక్షణ డెలివరీ, పట్టాదారు పాసుపుస్తకాలు పోస్టు ద్వారా డెలివరీ చేయడం, అక్కడికక్కడే ఈ- పట్టాదార్ పాసు పుస్తకం జారీ జరుగుతున్నదని ఆమె సూచించారు.
రాష్ట్ర స్థాయిలో ధరణి పోర్టల్ ద్వారా సేవలు అందిన వారు 5.17 కోట్లు, బుక్ చేసిన స్లాట్లు 10,45,878 పురోగతి, పూర్తి అయిన లావాదేవీలు 10,00,973, అమ్మకం 5,02,281, బహుమతి 1,58,215, వారసత్వం 72,085, తనఖా 58,285 గా నమోదు అయినట్లు ఆమె సూచించారు.
వనపర్తి జిల్లాలో పూర్తయిన లావాదేవీలు 28,061, అమ్మకం, బహుమతి 20,103, వారసత్వం 2278, భాగ పరిష్కారం 108, NALA 420, పరిష్కరించబడిన ఫిర్యాదులు 10,537, పెండింగ్ మ్యుటిషన్ 4710, భూమి విషయాలపై ఫిర్యాదులు (GLM) 4277, నిషేధించబడిన జాబితా 840, కోర్టు కేసులు, ఇంటిమేషన్ 518 వివరాలు నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత అని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయం సిబ్బంది, తాసిల్దార్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డీ.వేణుగోపాల్, (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, జిల్లా తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్