టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, జగన్రెడ్డికి ఒక్క చాన్సే చివరి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్పడుతున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మట్టి, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నాయని, అక్రమార్కులకు అండగా నిలిచిన పోలీసులు…దోపిడీని ప్రశ్నించిన ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో అరాచకపాలనకి అద్దం పడుతోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువుని మాయం చేసిన మట్టి మాఫియా ఆగడాలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుని ఖండిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేశారు.
అనుమర్లపూడిలో అక్రమ మట్టి తవ్వకాల పరిశీలనకి ఇటీవల ధూళిపాళ్ల వెళ్తే దాడి చేశారని, ఈ రోజు ఏకంగా అరెస్ట్ చేశారని, దీనివెనుక వైసీపీ మట్టిమాఫియా ఉందని అర్థం అవుతోందన్నారు. మట్టి మాఫియాపై పోరాడుతున్న ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ పోరాటంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ వుంటుందని నారా లోకేష్ ప్రకటించారు.