ఐకెపి కేంద్రాలకు రైతులి తీసుకువచ్చే ధాన్యంలో తాలు పేరుతో తూకం తగ్గిస్తే కేసులు నమోదు చేస్తామని డిఐజి ఏ.వి.రంగనాధ్ హెచ్చరించారు.
సోమవారం నల్లగొండ మండల పరిధిలోని అర్జాలబావి ఐకెపి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి కనీస మద్దతు ధర, తూకాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము తీసుకువచ్చిన ధాన్యంలో తాలు పేరుతో క్వింటాలుకు కిలో ధాన్యం తగ్గిస్తున్నారని, మాయిశ్చర్ ప్రతి రోజూ చూడడం లేదని చెప్పారు.
రైతుల ధాన్యంలో తూకం సాకులతో తూకం తగ్గించే వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
అనంతరం ఐకెపి నిర్వాహకులతో మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సౌకర్యంతో పాటు కరోనా ఉధృతి నేపధ్యంలో అందరూ విధిగా మస్కులు ధరించే విధంగా చూడాలని, సామాజిక దూరం పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత తనిఖీ
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను సంబంధించి ఈవిఎంలు భద్రపరిచిన అర్జాలబావి గోడౌన్స్ వద్ద స్ట్రాంగ్ రూమ్ భద్రతను ఆయన తనిఖీ చేశారు. సాయుధ బలగాల పహారాలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్ద పరిస్థితిని డిఐజి రంగనాధ్ పరిశీలించారు.