అన్నింటికి లాక్ డౌన్ సడలింపులు వర్తింపచేస్తున్నట్లే తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా అంచెలు అంచెలుగా దర్శన భాగ్యం కల్పించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లాక్ డౌన్ ముగిసే వరకు ప్రతి రోజు 5 వేల మంది కి దర్శనం అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
తిరుమల ఆలయం ముందు ప్రతిరోజు నాదనీరాజనం మండపంలో జరుగుతున్న ధన్వంతరి మహా మంత్ర పారాయణంలో ఆసక్తిగల తిరుమల బాలాజీ నగర్, తిరుపతి వాసులకు పాల్గొనే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ నిర్మూలనకు దీర్ఘకాల సమయం పడుతుందని వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనాతో కలసి జీవించాలని ఏపీ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని అందువల్ల ఇంకెంతకాలం దర్శనాన్ని ఆపుతారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చెప్పారు కదా సహజీవనం అని..
అంత వరకు భౌతిక దూరం, మాసుకుల ధారణ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రధాని కూడా హెచ్చరించిన విషయాన్ని టీటీడీ అధికారులు గుర్తించాలని వెంటనే దర్శనానికి అనుమతివ్వాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలను టిటిడి అధికారులు ఆదర్శంగా తీసుకుని శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు 5 వేల నుంచి 10 వేల మంది వరకు టైం స్లాట్ పద్ధతిలో భక్తుల సంఖ్యను పెంచుకుంటూ ఆధార్ కార్డు ఆధారంగా ఒక కుటుంబం నుంచి ఇద్దరేసి చొప్పున ఆర్టీసీ బస్,కార్లు (కేవలం ఇద్దరు మాత్రమే) ద్విచక్ర వాహనాల ద్వారా తిరుమలకు వచ్చేలా అనుమతించాలని ఆయన సూచించారు.
ఇది ట్రయల్ రన్ లాగా చేయాల్సి ఉంటుది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ,అలాగే శ్రీవారి సన్నిధిలో భక్తునికి మరొక భక్తునికి మధ్య ఎంత దూరం ఎలా మెయింటైన్ చేయాలి, కళ్యాణ కట్ట,నిత్య అన్నదానంలో కాటేజీలలో ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి అన్నదానిపై టీటీడీ ఉన్నతాధికారులకు, ఉద్యోగస్తులకు అవగాహన కల్పించేందుకు ఇది చక్కటి అవకాశం అని ఆయన అన్నారు. ఈ ట్రయల్ రన్ ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్దనే వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.