తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయినా, అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని ఆరోపిస్తూ జూన్ 2 నుండి 12 వరకు దీక్షా దివస్ జరపాలని cpi(ml) ప్రజాపంధ నిర్ణయించింది. మూడు రోజులపాటు ఖమ్మంలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభ వివరాలను ఆ పార్టీ కార్యదర్శి పోటు రంగారావు ఖమ్మంలో గురువారం మీడియా సమావేశంలో వివరించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల నేతలు కూడా హాజరైన ఈ సభలలో ఐదు ప్రధాన సమస్యలపై చర్చలు జరిపామని చెప్పారు. గడచిన 10 యేళ్లలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమాల గురించి చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. అసోమ్, బిహార్, డిల్లీ రాష్ట్రాలకు చెందిన cpi (ఎంఎల్) పార్టీ ప్రతినిధులు హాజరైన ఈ సభలలో
బిజేపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చ జరిపామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాము చేసిన పోరాటం గుర్తుచేశారు. 10 యేళ్ళు ఐనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరేవేరలేదన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని,
రైతాంగ అప్పులను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 2 నుండి 12 వరకు దీక్షా దివస్ పేరుతో ఆందోళనలు చేయనున్నట్లు చెప్పారు. 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ప్రదర్శనలు, దీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సమావేశంలో పార్టీ కేంద్ర, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.