అత్యవసర పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా నగదు తీసుకోవాలని చూసింది ఓ మహిళ. దీని కోసం రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. అప్పటి నుండి లోన్ యాప్ నిర్వాహకులు మహిళకు నరకం చూపించడం మొదలుపెట్టారు. అకౌంట్ లో డబ్బులు వేయకుండానే కట్టాలని మహిళను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పరిధిలో చోటుచేసుకుంది.
బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండే కనకదుర్గ అనే మహిళ నగదు అత్యవసరమయి రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. ఆన్ లైన్ లోన్ యాప్ లో తన ఆధార్ కార్డ్, పాన్ కార్డు లను అప్లోడ్ చేసింది. రూపీ పే యాప్ నుండి నగదు వస్తుందనుకున్న కనకదుర్గ కు నిర్వాహకుల నుండి వేధింపులు మొదలయ్యాయి. లోన్ యాప్ నుండి తనకు ఎలాంటి డబ్బులు రాలేదని కనకదుర్గ చెప్పినప్పటికీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఈ నెల ఆఖరుకు డబ్బులు కట్టకపోతే పరువు తీస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు దిశ SOS కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది.
రూపీ పే యాప్ లో ఎలాంటి రుణం తీసుకోనప్పటికీ తనను వేధింపులకు గురిచేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కనకదుర్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వివరాల మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని దిశ పోలీసులు సూచించారు.