రాజీనామా చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రంగా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. కొత్త మంత్రి వర్గంలో ఆయనకు స్థానంలేదని తెలియడంతో ఆయన మద్దతుదారులు భగ్గుమంటున్నారు. ఆయనకు సంఘీభావంగా ఇప్పటికి 12 మంది మంత్రులు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు.
కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సజ్జలకు సీఎం జగన్ ఆదేశించారు. సీఎం ఆదేశించడంతో సజ్జల, బాలినేని నివాసానికి వెళ్లి బుజ్జగిస్తున్నారు. 10 నిమిషాల పాటు బాలినేనితో సజ్జల మాట్లాడివెళ్లారు. బాలినేనిని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కలిశారు. జిల్లాలో సీనియర్గా ఉన్న తనకు మంత్రిపదవి వస్తుందని ఆశిస్తున్నానని ఉదయభాను తెలిపారు.
బాలినేనితో ఏ అంశాలూ చర్చించలేదని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా బాలినేనికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెబుతున్నారు. ఆయనకు డాక్టర్లు బిపి చెక్ చేశారు. రెండు సార్లు కంటే ఎక్కవ సార్లు గెలిచిన పలువురు సీనియర్ యమ్ యల్ ఏ లందరు పార్టీకి రాజీనామ చేయాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో గవర్నర్ కు పంపవలసిన మంత్రివర్గం కవర్ ను సజ్జల చేత తిరిగి తెప్పించు కున్న జగన్, అందులో మార్పులు చేసినట్లు చెబుతున్నారు.
తాజా మాజీ మంత్రి బాలినేని ఇంటికి వైసీపీ నాయకులు బారులుతీరుతున్నారు. మాచర్ల, చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు పొడసూపాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు కొత్త మంత్రి వర్గం జాబితాలో లేదంటూ ఆయన అనుచరులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి మంత్రి పదవి ఇవ్వొద్దంటూ ఆమె వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళనలకు సిద్ధం అయింది.