రైతు తాను పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలని, రోడ్ మీదకి వచ్చి ఆందోళన చేయడం తెలంగాణ రైతాంగం దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నదని తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ప్రక్క కిలో బియ్యం 50 రూపాయలకు కొనలేక వినియోగదారులు తంటాలు పడుతుంటే, మరో పక్క మా ధాన్యాన్ని కొనండి అని రైతు మిల్లుల దగ్గర బారులు తీరిన రైతు కథలు చూస్తుంటే ప్రభుత్వ అచేతన స్థితపై జుగుప్స కలుగుతుందని ఆమె అన్నారు.
రైతుల్ని తిరస్కరిస్తున్న మిల్లర్లు
మేము కొనం అని చెప్పి రైస్ మిల్లర్లు మిల్లులు మూసి వేస్తే, కిలోమీటర్ల పైగా అగి ఉన్న రైతుల బండ్లు వెను తిరిగిపోతుంటే వాళ్ళ కళ్ళ నుంచి కింద పడ్డ కన్నీళ్లు చూస్తుంటే, ఎంత హేయమైన ప్రభుత్వ విధానాలు అనిపిస్తుంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పండిన పంటకు నిప్పు పెట్టి అందులోనే పంట పండించిన రైతు దూకాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఒక్క సన్న బియ్యం ఏంటి, మొక్క జొన్నలకి గిట్టు బాటు లేదు… సన్న బియ్యం ఎవరు కొనక రోజు రోజుకి రంగుమారుతున వైనం…నల్ల కాటుక పట్టిన ప్రత్తి గతేంటి? వర్షానికి పిందెలన్నీ రాలిపోయిన ఉద్యానవన పంటల పరిస్థితి ఏంటి? అంటూ ఆమె ప్రశ్నించారు.
రైతుల ఫీట్లు చూడండి అసెంబ్లీ సీట్లు కాదు
రంగారెడ్డి జిల్లాలో సుమారు 10 లక్షల మంది రైతులు కూరగాయల పంటల మీద ఆధార పడ్డారు. అకాల వర్షాలతో వేసిన విత్తనాలు మునిగిపోయి, మొలిచిన పిందెలు రాలిపోయి, నిలిచిన పిందెలకు తెగుళ్లు వచ్చి… ఒక్క పూట అన్నం కూడా గడవలేని స్థితిలో రైతులు వున్నారు మరి వీరి పరిస్థితి ఏంటి? సబ్సిడీ ల మాటేంటి? రైతాంగం గురించి పట్టించుకోని మనం, ఎన్నికల గురించి, సీట్ల గురించి ఆలోచించడం న్యాయమా? అని కాట్రగడ్డ ప్రసూన ప్రశ్నించారు.