మరో మూడు నెలల్లో రాష్ట్ర మంత్రి వర్గంలో చేరతాడనుకున్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు ‘‘ఆడియో లీక్’’ శాపంగా మారింది. వైసీపీలో సీనియర్ నాయకుడైన అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తొలి దశ మంత్రి వర్గంలోనే అంబటికి స్థానం దక్కుతుందని భావించినా అది కుదరలేదు. అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత అవకాశం ఇస్తానని అప్పటిలోనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఉన్న అంబటి రాంబాబుకు ‘‘ఆడియో లీక్’’ అశనిపాతంగా మారింది.
అంబటి రాంబాబు ఒక మహిళతో మాట్లాడిన మాటలు ఈ ఆడియోలో సంచలనం కలిగించాయి. పాత గుంటూరుకు చెందిన ఒక అమ్మాయిని పంపుతున్నట్లు ఆ మహిళ రాంబాబుతో చెప్పగా ఆమె ‘‘అన్ని పనులు’’ చేసేందుకు సిద్ధమే కదా అని రాంబాబు అడిగినట్లు ఆ ఆడియోలో ఉన్నది.
గత రెండు రోజులుగా అంబటి రాంబాబు ఆడియో సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొడుతున్నది. పూర్తిగా వైరల్ అయిన ఈ ఆడియో పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సీరియస్ అయినట్లు చెబుతున్నారు.
కొద్ది రోజుల కిందట కాపు కులస్తులు తిరుగుబోతులు, తాగుబోతులు అంటూ అంబటి రాంబాబు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ వీడియో వైరల్ కావడంతో కాపు కులస్తులకు ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆ వివాదం సర్దుమణిగిందని అనుకుంటున్న సమయంలో ఈ ‘‘ఆడియో’’ బయటకు వచ్చింది.
తరచూ ఇలాంటి పనులకు పాల్పడుతున్నందున సీరియస్ అయిన వైసీపీ కీలకనేతలు ఆయన మంత్రిపదవిపై పునరాలోచనలో పడ్డారు. వచ్చే మంత్రి వర్గ విస్తరణలో అంబటి రాంబాబుకు అవకాశాలు లేనట్లే చెబుతున్నారు.
ఆడియో తనది కాదని, తన గొంతును ఎవరో అనుకరించారని అంబటి రాంబాబు ఇచ్చిన వివరణను వైసీపీ కీలక నేతలు పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.