యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని దివీస్ ఫార్మా కంపెనీ కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని కాలుష్య పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు జారీ చేసింది. ఎన్ జి టి చెన్నై బెంచ్ ఈ అంశంపై విచారణ జరిపింది.
జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలో జరిగిన ఈ విచారణ అనంతరం దివీస్ ఫార్మాకు నోటీసు జారీ చేశారు. వారితో బాటు కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం కూడా నోటీసులు అందుకున్నాయి. అంతే కాకుండా చౌటుప్పల్ లో ఫార్మా కాలుష్యం పై విచారణ జరిపేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు.
కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మ వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉంటారు. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్ జి టి ఆదేశం జారీ చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరించి కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని ఎన్ జి టి ఈ కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 21 న ఎన్ జి టి నిర్వహించనున్నది.