నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు డీకే మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బి ఫాం తీసుకొని, హస్తం గుర్తుపై గెలిచి, గెలిచిన మూడు నెలలు గడవక ముందే టీఆర్ఎస్ లో చేరిన బీరం కొల్లాపూర్ కు అన్యాయం చేశారని ఆయన అన్నారు.
దళితులకు ఇస్తానన్నా మూడు ఎకరాల భూమి ఏడు మండలాల్లో 140 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా బీరం ఇవ్వలేదని, దళితులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఎస్ సి సబ్ ప్లాన్ నిధులు ఇవ్వలేదని ఆయన అన్నారు. సింగోటం బిడ్జి నిర్మాణం పేరుతో ప్రభుత్వం నుంచి బీరం రూ. 26 కోట్లు మంజూరు చేయించుకున్నారని డికె మాదిగ అన్నారు.
ఇది సరిపోదని ఆయన సొంత గ్రామమైన సింగోటం కు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పేరు మీద మరో రూ.15 కోట్లు మంజూరు చేయించుకున్నారని ఆయన తెలిపారు. ఈ సొమ్మంతా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఆలయ అభివృద్ధికి ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో దేవాలయాలు లేవా? వాటి సంగతి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కనీసం మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి కట్టించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు.