టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి స్థాయికి మించిన మాటలు మాట్లాడితే సహించేది లేదని, గువ్వల గుమస్తాలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా రేవంత్ రెడ్డి యువసేన అధ్యక్షుడు డీకే మాదిగా హెచ్చరించారు.
ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేరు చెప్తే రేవంత్ రెడ్డి గుండెల్లో భయం పుడుతుందనీ మాట్లాడిన, వంగురు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జడ్పి కోఆప్షన్ సభ్యుడు హమిద్, నాయకులు లాలూ యాదవ్ గణేష్ రావు ల పై డీకే మాదిగ నిప్పులు చెరిగారు.
టైగర్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మీరు ఎంత? మీ బతుకు ఎంత? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారా? ఇంకోసారి మాట్లాడితే మీరు వీపులకు సున్నం రాయించుకోవాల్సి వస్తుంది అన్నారు. గువ్వల బాలరాజు చేస్తున్న అక్రమాలను బయట పెడుతున్న రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డికే.మాదిగ హెచ్చరించారు.
తెలంగాణ మొట్టమొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి ఉసురు టిఆర్ఎస్ పార్టీకి తగులుతుందన్నారు. అతనికి నివాళులు అర్పించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. శ్రీకాంతాచారి తల్లి ఉసురు ముఖ్యమంత్రికి తగులుతుందని డికే.మాదిగ అన్నారు.
తెలంగాణలో మూడు లక్షల 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేస్తూ 40 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన కేసీఆర్ పై నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఆయన అన్నారు.
గతంలో ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలమూరు ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్న సంగతి పాలమూరు వెళ్లి చూసి మాట్లాడండి. లక్ష ఎకరాలకు నీరు అందిస్తా అన్న కేసీఆర్, నాలుగు వేల ఎకరాలకు నీరు అందించడంలో ఆయన చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో గమనించాలని కోరారు.
అచ్చంపేట లో గువ్వల బాలరాజు తన సొంత క్యాంప్ ఆఫీస్ కు తీసుకెళ్ళి దళితులను, గిరిజనులను, రెడ్లను, దొరలను, కొట్టిన సంగతి మరిచారా మిత్రులారా అని ఆయన ప్రశ్నించారు.