కరోనాకు సంబంధించి తమ బాధలు చెప్పుకునే వారిని పోలీసులు వేధిస్తే సహించేది లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇకపై ఎవరినైనా వేధిస్తే కోర్టు ఆదేశాల ధిక్కారంగా భావిస్తామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
కరోనా వల్ల తాము పడుతున్న బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటే పోలీసులు కేసులు ఎలా పెడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఇటీవల తనకు ఆక్సిజన్ కావాలని ఓ వ్యక్తి ట్వీట్ చేయడం, దాన్ని ఓ ప్రముఖ జర్నలిస్ట్ రీ ట్వీట్ చేస్తే యూపీ ప్రభుత్వం వారిపై కేసు పెట్టింది. ఎవరైనా బెడ్ లేదని, ఆక్సిజన్ లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసు పెడతామని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదే విధంగా చాలా రాష్ట్రాలలో జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇవాళ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఇది తాము చేస్తున్న హెచ్చరిక అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
కరోనా బాధలను బయటకు తీసుకువస్తూ సోషల్ మీడియా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నదని ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది.