కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ మంగళవారం నుండి అమలు చేస్తున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు.
రాత్రి పూట కర్ఫ్యూ అమలుపరచడానికి జిల్లాలో ప్రత్యేకంగా 32 టీమ్స్ ఏర్పాటు చేశారు. సిద్దిపేట ,గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక, పట్టణాల్లో ప్రత్యేకంగా అన్ని చౌరస్తాలో పికెట్స్ ఏర్పాటు చేశారు.
రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, థియేటర్లు, దుకాణాలు, మద్యం దుకాణాలు, హోటల్స్ బార్ లు, రెస్టారెంట్ లు మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
కర్ఫ్యూ నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారన్నారు.
విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవ, అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
రాత్రి పూట 9-00 గంటల నుంచి ఉదయం 5-00 గంటల వరకు కర్ఫ్యూ అమలలో ఉంటుందని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలు, షాపింగ్మాల్స్, రెస్టారెంట్లను రాత్రి 8-00 లోగా మూసివేయాలని, రాత్రి 9-00 గంటల తర్వాత కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో మినహాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు, మెడికల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు విధిగా తప్పనిసరిగా ఐడీ కార్డులను చూపాలని ఆయన కోరారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించి కరోనా వ్యాధి నివారణ గురించి ప్రతి ఒక్కరూ కలసి రావాలని కమిషనర్ కోరారు.