డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) 4 వ దశ ప్రవేశాలు తక్షణమే ప్రారంభించాలని OU విద్యార్థి JAC రాష్ట్ర కార్యదర్శి అన్నం నాగార్జున డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన దోస్త్ కన్వీనర్ లింబర్తి కి ఈమెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. డిగ్రీ ఆన్ లైన్ సర్వీసుల 3వ దశ ఈ నెల 5వ తేదీతో ముగిసిందని అయితే ఎంతో మంది ఇంకా వేచి చూస్తూనే ఉన్నారని అన్నం నాగార్జున తెలిపారు.
డిగ్రీ ఆన్లైన్ విద్యా ప్రవేశం కోసం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్న ఏకైక మార్గం దోస్త్ ఒక్కటేనని అది కూడా సమయం పూర్తి కావడంతో వారు అయోమయంలో పడిపోయారని నాగార్జున తెలిపారు. దరఖాస్తు కోసం మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
ఆన్ లైన్ సేవల అంతరాయం వల్ల చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారని ఆయన తెలిపారు. పుట్టిన తేదీ, వేలిముద్రలు ఇలా అన్ని వివరాలు సరిగా నమోదు చేయాల్సి రావడం వల్ల ఎంతో సమయం పడుతున్నదని, ఈ లోపు ఆన్ లైన్ సేవలలో బ్రేక్ వస్తున్నదని ఆయన తెలిపారు.
ఇలా ఎంతో సమయం వృధా అవుతున్నదని అందువల్ల చాలా మంది దరఖాస్తు చేయలేకపోయారని ఆయన వివరించారు. తక్షణమే దోస్త్ 4 ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.