ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిరంకుశంగా అణచివేయాలని చూడటం ఎంత వరకూ సమంజసమో ప్రజలు ఆలోచించాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి కోరారు.
జిల్లా ప్రజలు అందరూ ఒక్క సారి ఆలోచించి ఈ నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన రోజు వచ్చిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను మళ్లించుకుపోతుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నదని ఆయన అన్నారు.
జల దోపిడి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా తమపై తెలంగాణ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తున్నదని మల్లు రవి విమర్శించారు. తనను, డాక్టర్ నాగం జనార్ధన్ రెడ్డి, డాక్టర్ చిన్నా రెడ్డి, సంపత్ కుమార్, డాక్టర్ వంశీ చందర్ రెడ్డి, డాక్టర్ వంశీ కృష్ణ, శంకర్ ప్రసాద్, పటేల్ సుధాకర్ రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్ లను టీఆర్ ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా అడ్డుకున్నదని ఆయన అన్నారు.
నిజాం కాలంలోని రజాకార్ల పాలనను తలపించే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని డాక్టర్ మల్లు రవి ఆరోపించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలను తక్షణమే పూర్తి చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు మల్లు రవి తెలిపారు. కృష్ణా నదీ జలాలపై హక్కును మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు వదులుకోరాదన్నదే తమ ఆరాటమని, అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నదని ఆయన అన్నారు.