పెద్ద కుటుంబం…. అయినా ఆమె అనాథ. గత 28 ఏళ్లుగా తల్లిదండ్రులు తోడబుట్టిన వారి కోసం అన్వేషిస్తూనే ఉన్నది…. అయినా ఫలితం లేదు. సినిమా స్టోరీలాగా ఉన్న దుర్గ వ్యధాత్మక కథ ఇది. ఆరేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పిపోయింది దుర్గ. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఒక సిమెంటు ఫ్యాక్టరీకి చెందిన ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె నర్సుగా పని చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రాంతానికి చెందిన దుర్గకు ఆ ఊరి పేరు గుర్తు లేదు. ఆ ఊరి పక్కన ఒక రైల్వే స్టేషన్ ఉండేది. ఆరేళ్ల వయసులో దుర్గ రైలు చూడాలనే కోరికతో అక్కడకు వెళ్లింది. అక్కడ ఆగి ఉన్న రైలు ఎక్కింది. అంతలో ఆ రైలు కదిలిపోయింది.
ఎక్కడకు పోతున్నదో తెలియదు… ఏం చేయాలో తెలియదు… అలా ఏడుస్తూనే నిద్ర పోయింది. లేచి చూసే సరికి కాచిగూడా రైల్వే స్టేషన్ చేరుకున్నది. అక్కడి రైల్వే పోలీసులు దుర్గను చూసి వివరాలు అడిగారు. ఆమె చెప్పలేకపోయింది.
దాంతో కాచిగూడా పోలీసులకు అప్పగించారు. పోలీసులు అక్కడ నుంచి దుర్గను కాచిగూడా మిషనరీ హోం కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటూ చదువుకున్నది. తల్లిదండ్రుల పేర్లు త్రివేణి, ఆంజనేయులు. అక్కా చెల్లెళ్లు కూడా ఉన్నారు.
వారి పేర్లు వెంకట లక్ష్మి, మంగ, లలిత. ఈ ఐదు పేర్లు మర్చి పోకుండా ఉండేందుకు నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నది. బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన మిషనరీ నిర్వాహకులే దుర్గకు పెళ్లి చేశారు. భర్త అశ్వనీ కుమార్ దామరచర్లలోని ఒక లారీ ట్రాన్స్ పోర్టు లో పని చేస్తుంటాడు.
చాలా కాలంగా తల్లితండ్రి తోబుట్టువుల కోసం వెతుకుతున్న దుర్గ కలలు నేటికీ ఫలించలేదు…. వీలైన అన్ని మార్గాలలో అన్వేషిస్తున్నది. దుర్గ అన్వేషణ ఫలించాలని సత్యంన్యూస్.నెట్ కోరుకుంటున్నది.