విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేడు దుర్గమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గా దర్శనం ఇస్తున్నది. సర్వ జగత్తుకు మూలకారణశక్తి జగదంబ. ఆమె తనను తాను ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులుగా విభజించుకుని ఈ సర్వాన్నీ పరిపాలిస్తోంది. అటువంటి శక్తి ఆరాధన మన ధర్మంలో ఎంతో విశిష్టమైనది. అత్యంత విస్తృతిని సంతరించుకుంది. వేదాలు మొదలుకుని ఆగమ పురాణాల వరకూ దేవీతత్త్వం అపారంగా వర్ణితమైంది.
దేవీ ఉపాసన పద్ధతులు కూడా అనంతంగా కనిపిస్తుంటాయి. దేవీ శరన్నవరాత్రులలో జగన్మాతను నవదుర్గలుగా కొందరు అర్చిస్తారు. ప్రత్యేకించి నవరాత్రి పూజల్లో కలశస్థాపన చేస్తారు. ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి అఖండ దీపాన్ని వెలిగిస్తారు. మహాలక్ష్మి – మహాసరస్వతి – మహాకాళీ రూపాలుగా మరికొందరు కొలుచుకుంటారు. మహిషాసుర మర్దినిగా – అపరాజితగా అనేకమంది సేవించుకుంటారు.
ఎవరు ఏరీతిగా ఉపాసించినా అవన్నీ ఒకే దేవికి చెందుతాయి. బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.
అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి. ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత. ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.
మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది.
భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.
బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.
శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం
బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై చ ధీమహి తన్నోబాలా ప్రచోదయాత్.
పూజా ఫలితం
అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది.ధనాధాయాన్ని పెంచుతుంది. ఆయుషును వృధి చేస్తుంది.ఆరోగ్య బలాన్ని ఇస్తుంది.