తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే పరమ పవిత్రమైన కానుకలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టే కొంతమంది అధికారుల గుండెల్లో కాగ్ ఆడిట్ తో దడ ప్రారంభమైందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) పరిధిలోకి తీసుకురావాలని తాము ఎన్నో రోజుల నుంచి కోరుతున్నామని ఆయన అన్నారు. చివరకు రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్య స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారని ఆయన తెలిపారు.
ఈ ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా స్పందించిన ధర్మకర్తల మండలి ఈ మేరకు ఒక తీర్మానం కూడా చేసిందని ఆయన తెలిపారు. కాగ్ పరిధిలోకి తీసుకురావాలని తీర్మానం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ కు సభ్యులకు నవీన్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
20 ఏళ్ల లెక్కలపై ఆడిట్ జరపాలి
రాబోయే రోజుల్లో కాగ్ ఆడిట్ జరపడమే కాకుండా గత 20 సంవత్సరాలుగా ఉన్న లెక్కలపై కూడా కాగ్ ఆడిట్ జరిపించాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎవరు చైర్మన్ లుగా ఏ అధికారి ఈవో లుగా పని చేసినా పలు సందర్భాలలో శ్రీవారి నిధులు ఎక్కడ? ఎందుకు? ఎంత? ఖర్చు చేశారు అలాగే గతంలో శ్రీవారి స్థిర, చరాస్తులు సక్రమంగా విక్రయించారా మిగిలిన ఆస్తులు భద్రంగా ఉన్నాయా లేవా అన్న దానిపై కాగ్ ఆడిట్ జరగాలి వాస్తవాలు భక్తులకు తెలియాలి అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
అదే విధంగా శ్రీవారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయా? ఉంటే గతంలో ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు అలాగే ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆరోపించిన విధంగా పింక్ డైమండ్ మాయమయ్యిందా ? లేక టీటీడీకి మూడవసారి మళ్లీ వచ్చిన అధికారి చెప్పిన విధంగా అసలు పింక్ డైమండ్ అనేది లేదా? అన్న దానిపై స్పష్టంగా కాగ్ ఆడిట్ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవారి పింక్ డైమండ్ పై గతంలో మీడియా ముఖంగా మాట్లాడిన రమణ దీక్షితులు, విజయ్ సాయి రెడ్డి పై అప్పటి ధర్మకర్తల మండలి చైర్మన్ అలాగే ఇప్పటి ఈవో 200 కోట్ల పరువు నష్టం కు సంబంధించి తిరుపతి కోర్టులో ఫీజు కింద కట్టిన శ్రీవారి సొమ్ము 2 కోట్ల రూపాయలపై కాగ్ సమగ్ర ఆడిట్ జరిపి వడ్డీ రూపంలో టిటిడికి జరిగిన నష్టపరిహారాన్ని సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
టీటీడీ లో ఇటీవల ప్రారంభించిన శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చింది ఆ నిధులు ఏ ఖాతాలో జమ చేస్తున్నారు వాటి వివరాలపై కాగ్ ఆడిట్ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
టిటిడి ని కాగ్ తో పాటు సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురావాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.