ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామ పరిదిలో ఉన్న పోలవరం కుడి కాలువ గట్టు మట్టిని మాఫియా బొక్కేస్తున్నది. ఈ మేరకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు ఆర్ డి ఓ పెంచల కిషోర్ మంగళవారం కొప్పాక పోలవరం గట్టు ప్రాంతాన్ని పరిశీలించారు. కొప్పాకలో పోలవరం గట్టు మట్టిని రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా మాఫియా తరలిస్తున్నది.
జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరు ఆర్ డి ఓ తో పాటు మైనింగ్ ఏ డి పెదవేగి తహసీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ ఏ ఈ కొప్పాక వి ఆర్ ఓ తో కూడిన అధికార బృందాన్ని కొప్పాక లో పోలవరం గట్టు మట్టి ని తరలిస్తున్న ఘటనపై విచారణ జరిపించేందుకు పంపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు కొప్పాక లో పర్యటించి పోలవరం గట్టు మాటి తరలింపు పై నిషేధాజ్ఞలు విధించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆర్ డి ఓ పెంచల్ కిషోర్ హెచ్చరికలు జారీచేశారు