మట్టి… భూమ్మీద చాలా చోట్ల ఉండేది అదే. అయితే కొన్ని రకాల మట్టి ఎంతో విలువైనది. సారవంతమైనది. మరింకేం ఈ రెండు పాయింట్లు చాలు అమ్ముకోవడానికి అడవుల్ని కొల్లగొట్టి కలప అమ్మేవారు ఒకరైతే, భూమిని చీల్చి మరీ నీళ్ల వ్యాపారం చేసేవారు మరొకరు. భూమి తల్లిని కోసి మరీ మట్టి తీసి అమ్మేవారు మరొకరు.
మూడో క్యాటగిరీ వారు గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో అధికంగా ఉన్నారు. మరి వీరికి గ్రామ రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందేమో తెలియదు కానీ యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వి రాత్రి పూట స్మగ్లింగ్ చేసేస్తున్నారు. నకరికల్లు మండలంలో ఉన్న పదమూడు గ్రామాల్లో ప్రస్తుతం ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. దాపుగా ప్రతి గ్రామంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.
అక్రమంగా తరలి వెళుతున్న వందలాది ట్రక్కులు
అక్రమంగా వందలాది ట్రక్కుల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. అంతేకాకుండా అడవిలో ఉన్న మట్టిని తవ్వేస్తున్నారు. అడవి మొక్కలు ఈ మట్టి ఆధారంగానే ఏపుగా పెరుగుతాయి. కింది నుంచి మట్టి తీసేస్తుంటే చిన్న వాన వచ్చినా అడవి ధ్వంసం అవుతుంది. అయితే మాకేంటి? మాకు కావాల్సింది లాభమే అంటూ ఎర్రమట్టి తవ్వి తీసుకెళుతున్నారు.
రాజకీయ నాయకులకు భయపడి రెవెన్యూ అధికారులు సైలెంటుగా ఉంటున్నారా లేక అవినీతికి అలవాటు పడి మౌనంగా ఉంటున్నారా అనేది వేచి చూస్తే కానీ తెలియదు. రాత్రుల సమయంలో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఎంతో సారవంతమైన ఈ మట్టిని తరలిస్తున్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారుల కనుసైగల్లోనే ఈ మట్టి స్మగ్లింగ్ జరుగుతున్నదా అనేది గ్రామస్తుల అనుమానం.
రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కుతోనే జరుగుతున్నాయా?
వారికి తెలీకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరగవు. గ్రామస్తులు సమాచారం ఇచ్చినప్పటికీ దానిపైన దృష్టి పెట్టని గ్రామ రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు ఈ అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి పెట్టాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ముఖ్యంగా నకిరేకల్లు మండలం గుల్లపల్లి గ్రామంలోని అడవిలోని మట్టి మొక్కలకు ఉపయోగిస్తారు. ఈ మట్టిని రాత్రుల సమయంలో టిప్పర్ల ద్వారా తరలిస్తారు.